హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటకశాఖ లీజు నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టి, సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. షామీర్పేట జవహర్నగర్లోని సర్వే నంబర్ 12లో సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ అభివృద్ధి పేరుతో ప్రజయ్ ఇంజినీర్స్ సిండికేట్ సంస్థ 130 ఎకరాల టూరిజంశాఖ భూమిని 2004లో తీసుకున్నదని తెలిపారు. నాటి నుంచి లీజు నిబంధనలు పాటించకపోవడంతో సంస్థపై చర్యలు తీసుకొని భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్లోని యాత్రి నివాస్ పకన ఉన్న 4,600 గజాల భూమిని ఈ-సిటీ జెయింట్ స్క్రీన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకున్నదని, నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నందున ఆ లీజును రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఏడాది కాలంగా టూరిజం అధికారుల కృషి వల్ల శాఖకు రూ.50 కోట్ల బకాయిలు వసూలు అయ్యాయని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా రూ.1000 కోట్ల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఎండీ మనోహర్, ఓఎస్డీ సత్యనారాయణ, లీగల్ ఆఫీసర్ ఆదిల్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ తదిరులు పాల్గొన్నారు.