TSRTC | ప్రయాణికులకు వేగంగా, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీఎస్ ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో శనివారం ట్యాంక్బండ్ వేదికగా కొత్తగా 50 సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కలిసి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పచ్చజెండా ఊపి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో యాజమాన్యం నూతన బస్సులను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు 50 బస్సులు అందుబాటులోకి రాగా, వాటిని శనివారం ప్రారంభించనున్నారు.