TSRTC | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బందిపై దాడులకు దిగడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని పేర్కొంది. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించే, దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఈ వార్నింగ్ ఇచ్చింది.
కండక్టర్పై ఓ మహిళ బూతులు మాట్లాడుతూ.. కాలితో తంతూ.. వీడియో
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2024
హయత్నగర్ 1 డిపోకు చెందిన ఇద్దరు కండక్టర్లపై దుర్భాషలాడుతూ మహిళలు సోమవారం వేర్వేరుగా దాడులకు దిగారు. చిల్లర విషయంలో ఒక మహిళ కండక్టర్పై దాడికి దిగితే.. ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్ సెల్ఫోన్ లాక్కొని అసభ్యపదజాలంతో మరో మహిళ దూషించింది. అలాగే పికెట్ డిపోకు చెందిన మహిళా కండక్టర్పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలకు సామూహికంగా దాడులకు దిగారు. ఈ మూడు ఘటనలను టీఎస్ఆర్టీసీ సీరియస్గా తీసుకుంది. పై మూడు ఘటనలపై టీఎస్ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
టీఎస్ఆర్టీసీ నియమావళి ప్రకారమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని.. నిబంధనల మేరకే టికెట్ల జారీ ప్రక్రియను కండక్టర్లను కొనసాగిస్తున్నారని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఒకవేళ ప్రయాణికులు టికెట్ తీసుకోకుంటే.. ఆ విషయాన్ని చెకింగ్లో గుర్తిస్తే.. ఆ సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని సిబ్బంది చెబుతున్నా.. కొందరు ఇప్పటికీ ఫొటో కాపీలను, స్మార్ట్ఫోన్లలో గుర్తింపు కార్డులను చూపిస్తున్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అవి చెల్లవని జీరో టికెట్కు సిబ్బంది నిరాకరిస్తే.. కొందరు ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగుతున్నారని తెలిపింది. మహాలక్ష్మీ స్కీం ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డు సిబ్బందికి చూపించి.. విధిగా జీరో టికెట్ తీసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలు ఉంటే 040-69440000, 040-23450033 నంబర్లకు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. సోషల్మీడియా ద్వారా కూడా ఫిర్యాదులను సంస్థ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది. అలాగే నేరుగా సమీపంలోని డిపో కార్యాలయాలకు వెళ్లి వివరించవచ్చని తెలిపింది. ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని.. అంతేగానీ సహనం కోల్పోయి ఈ తరహా ఘటనలకు పాల్పడటం సరైంది కాదని సూచించింది.