హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): హైటెక్ హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో నడుస్తాయి. ఈ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ హాజరవుతారు.
ఉచిత వై-ఫై సదుపాయం
తొలిసారిగా వాడకంలోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సు 12 మీటర్ల పొడవు, 30 బెర్తుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యంతో పాటు ట్రాకింగ్ సిస్టం, పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వాటర్ బాటిల్ సాకెట్, మొబైల్ చార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్లను ఏర్పాటు చేశారు. గమ్యస్థానాల వివరాలు తెలిపేలా ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పారింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం (ఎఫ్డీఏఎస్) కూడా ఉంటుంది.