హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా 4,318 ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ బీ వరప్రసాద్ చెప్పారు. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఉంటాయని తెలిపారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు 984 బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు. స్పెషల్ బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం ఉన్నదని, ప్రయాణికులు www.tsrtconline.inలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జిపై అదనంగా 50 శాతం వసూలు చేయనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. కానీ, తెలంగాణ సంక్రాంతి బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలుచేయడం లేదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల ఆపరేషన్ పర్యవేక్షణకు 200 మంది అధికారులను వివిధ పాయింట్ల వద్ద నియమించారు.
జూబ్లీ బస్స్టేషన్, పికెట్ నుంచి: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు
సీబీఎస్ నుంచి: కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచెర్ల, నెల్లూరు వైపు
ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి: యాదగిరిగుట్ట, వరంగల్వైపు
దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ నుంచి: మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ, సూర్యాపేట