TSRTC | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడంతోపాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా కారుణ్య నియామకాల ద్వారా 1,606 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇప్పటికే డ్రైవర్లుగా 20, కండక్టర్లుగా 1,226, శ్రామిక్స్గా 62, కానిస్టేబుళ్లుగా 298 మందికి ఉద్యోగాలు కల్పించిన టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో 166 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేసింది. వీరిలో 39 మందిని గ్రేటర్ హైదరాబాద్ జోన్లో, 68 మందిని హైదరాబాద్ జోన్లో, 59 మందిని కరీంనగర్ జోన్లో నియమించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ‘బాలాజీ దర్శన్’ పేరుతో రూ.300 ప్రత్యేక శీఘ్ర దర్శన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. రోజూ దాదాపు వెయ్యి మంది భక్తుల చొప్పున ఇప్పటివరకు 1,14,565 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది. సరుకు రవాణా కోసం టీఎస్కార్గోను ఏర్పాటుచేసి ప్రజల మద్దతు చూరగొంటున్న టీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించేలా ఎఫ్24 టికెట్ను ప్రవేశపెట్టింది. 24 గంటలపాటు చెల్లుబాటయ్యే ఈ టికెట్కు నలుగురు వ్యక్తులు రూ.300 చెల్లించి సిటీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థినులు, మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను ప్రారంభించింది.