హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే వాటిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను నడపనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై బస్భవన్లో సజ్జనార్ ఆదివారం సమీక్ష నిర్వహించారు.
రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులు
శివారు ప్రాంతాలను 12 కారిడార్లుగా విభజించి 350 వరకు బస్సుల ను నడుపుతున్నామని సజ్జనార్ తెలిపా రు. ఇబ్రహీంపట్నం క్లస్టర్లో విద్యార్థు ల రద్దీ ఎకువగా ఉన్నదనే విషయం సంస్థ దృష్టికి వచ్చిందని, ఆ కారిడార్లోని కాలేజీలకు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని వెల్లడించారు. వారిలో 3వ వంతు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా వారం రోజులు గా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నామని చెప్పారు. విద్యాసంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవనప్రసాద్, చీఫ్ఇంజినీర్ ఐటీ రాజశేఖర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ఎంలు వరప్రసాద్, వెంకన్న తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫుట్బోర్డు ప్రయణాలు వద్దు
విద్యార్థులు ఫుట్బోర్డుపై ప్రయాణిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఎండీ సజ్జనార్ కోరారు. కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.