TSRTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పండుగనాడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. లక్కీ డ్రాలో ఎంపికైన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందజేయనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురు చొప్పున 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి.. వారికి ఈ బహుమతులు అందించనుంది.
ఈ నెల 30, 31వ తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ వెనకాల పేరు, ఫోన్ నెంబర్ రాసి, స్థానిక బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ల్లో వేయాలని సూచించింది. సెప్టెంబర్ 9వ తేదీలోగా లక్కీ డ్రా నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.