TS RTC | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్రవ్యాప్తంగా 3వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన రాఖిపౌర్ణమి బస్సు సర్వీసుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, సకాలంలో సర్వీసులను నడపాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతిరోజు వెయ్యి బస్సుల చొప్పున నడపనున్నట్టు సజ్జనార్ వివరించారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరుడు ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని, ఫలితంగా ఒక రోజే రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందని గుర్తు చేశారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒకరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.