TSRTC | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల నడుమ పరస్పరం బస్ సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) ఎండీ దిప్తేశ్కుమార్ పట్నాయక్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం టీఎస్ఆర్టీసీ 10 బస్ సర్వీసులను ఒడిశాకు, ఓఎస్ఆర్టీసీ 13 సర్వీస్లను తెలంగాణకు నడుపనున్నాయి.
హైదరాబాద్ -జైపూర్ 2, ఖమ్మం-రాయగఢ్ 2, భవానీపట్నం-విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపనున్నది. నవరంగ్పూర్ -హైదరాబాద్ 4, జైపూర్ -హైదరాబాద్ 2, భవానీపట్నం-విజయవాడ (వయా భద్రాచలం) 2, రాయగఢ్-కరీంనగర్ 2, జైపూర్ -భద్రాచలం 3 బస్సులను ఓఎస్ఆర్టీసీ తిప్పనున్నది. తెలంగాణ సర్వీసులు 3,378 కిలోమీటర్ల మేర, ఒడిశా సర్వీసులు 2,896 కిలోమీటర్ల మేర నడువనున్నాయి. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వీ రవీందర్, జేడీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, వినోద్కుమార్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎంలు జీవనప్రసాద్, విజయ్కుమార్, సీఎంఈ రఘునాథరావు, ఐటీ సీఈ రాజశేఖర్, బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) సంతోష్కుమార్, చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్) విజయ పుష్ప, ఓఎస్ ఆర్టీసీ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్ఫోర్ట్ ప్లానర్ సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.