TSRTC | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్తగా 275 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
అయితే, ప్రభుత్వం ఇటీవల కొత్తగా 80 బస్సులను రోడ్డెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై నాటికి వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం కింద రోజుకు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో జులైలో అందుబాటులోకి రాబోతున్న వెయ్యి బస్సులకు అదనంగా మరో 275 కొత్త బస్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు.
ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోనున్నది. ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులు ఇవ్వాలని మంత్రి పొన్నం అధికారులకు సూచించారు. ఆర్టీసీలోని 11 రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేయనున్నది. పెండింగ్లో ఉన్న నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరగనుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివరించారు.