TSRTC | మహాలక్ష్మీ పథకం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించింది. లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రధానంగా సీట్ల విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. దీంతో బస్సులో ఎక్కువ సీట్లు ఉంటేనే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని భావించిన ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని బస్సుల్లో ఇప్పుడు ఉన్న సీట్లను తొలగించి.. మెట్రో రైలు మాదిరిగా ఇరువైపులా సీటింగ్ ఏర్పాటు చేస్తే.. ఎక్కువ స్థలం ఉండటంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. ఈ ఆలోచనకు తగ్గట్టుగానే పలు సిటీ బస్సుల్లో సీట్ల అమరికను మార్చి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. ప్రయోగాత్మక చేపట్టిన ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
సిటీ బస్సుల్లో 44 సీట్లు ఉంటే 63 మంది ప్రయాణిస్తే 100 శాతం ఆక్యుపెన్సీని ఆర్టీసీ పరిగణిస్తుంది. మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు, కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడానికి ఇబ్బందిగా మారింది. టిక్కెట్ల జారీ ప్రక్రియలో ఎవరికీ జీరో టికెట్ ఇవ్వకున్నా కండక్టర్పైనా చర్యలు తీసుకుంటున్నందున.. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా సీటింగ్ సిస్టమ్ మార్చడమే మంచిదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.