హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ఆర్టీసీ డిపోలను మూసివేస్తున్నట్లు పలు మీడియాల్లో వచ్చిన కథనాలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ డిపోల మూసివేతపై వస్తున్న వార్తలు అవాస్తవం అని సజ్జనార్ స్పష్టం చేశారు. భూములు అమ్మే ఆలోచన ఆర్టీసీకి లేదు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీ చాలా ముఖ్యం అని తేల్చిచెప్పారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది అని సజ్జనార్ పేర్కొన్నారు.
ఎంజీబీఎస్లో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ స్టాళ్లలో వస్తువుల ధరపై సజ్జనార్ ఆరా తీశారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా దుకాణంపై 3 కంటే ఎక్కువ ఫిర్యాదులుంటే శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు.