హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్ డ్యూటీ మార్చకపోవడమే ఆత్మహత్యకు కారణమన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని తెలిపారు. రాజయ్య స్వీయ అభ్యర్థన మేరకే మూడు నెలల క్రితం జేబీఎస్కు బదిలీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడని, తన కుటుంబం అక్కడే ఉంటోందని, జేబీఎస్కు బదిలీ చేయాలని ఆయనే అభ్యర్థించారు. జేబీఎస్ డ్యూటీని మార్పు చేయమని అధికారులను రాజయ్య ఎప్పుడూ అడగలేదని తెలిపారు.
ఆయన కూతురు గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్కు వచ్చింది. అయితే డిసెంబర్ 6న ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో పలు ఆలయాల సందర్శనకు ఒక వారం రోజుల సెలవు కావాలని దరఖాస్తు చేసుకోగా, మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అయితే చివరి సారిగా నవంబర్ 23న విధులకు హాజరయ్యాడు. గోదావరిఖనిలోని తన స్వగృహంలో వ్యక్తిగత కారణాలతో రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే, గోదావరిఖని డిపో మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం టీఎస్ఆర్టీసీ తరుపున స్వయంగా రూ.20 వేలను కుటుంబసభ్యులకు అందజేశారు.
రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు కారణమని కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. డ్యూటీ మార్పు కోసం గోదావరిఖని డిపోలో ఆయన ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, వాస్తవాలను తెలియజేయాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నామని తెలిపారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏకపక్ష వార్తలను ప్రచురించడం సరికాదు. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారుల వివరణ తీసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులను కోరుతున్నామని వీసీ సజ్జనార్ సూచించారు.