Drugs Parcel | సైబర్నేరగాళ్లు రోజురోజుకీ తెలివిమీరుతున్నారు. ఒకప్పుడు బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పంథా తొక్కుతున్నారు. ఆధార్ కార్డు అప్డేషన్.. ఎల్పీజీ కేవైసీ.. ఇలా సమాజంలో ఉన్న కరెంట్ టాపిక్ను ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ఇటీవల డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో తాజాగా దాన్నే తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. ముందుగా మీకు ఓ పార్సిల్ వచ్చిందని ఫోన్ చేయడం.. ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు, పోలీసుల పేరిట కాల్ చేసి పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించడం చేస్తున్నారు. వాళ్ల మాయమాటలు నమ్మి ఎవరైనా భయభ్రాంతులకు గురైనట్లు కనిపిస్తే వారి నుంచి దొరికినకాడికి దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని వీసీ సజ్జనార్ తెలిపారు. మీ పేరిట ఫెడెక్స్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని బెదిరింపులకు దిగుతున్నారని.. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయపెట్టిస్తున్నారని తెలిపారు. ఎవరైనా భయపడితే అందినకాడికి దండుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. డ్రగ్స్ పార్సిల్ వచ్చిందనగానే భయపడి.. అడిగినంత డబ్బులు సమర్పించవద్దని సూచించారు.
ఇలాంటి సైబర్ మోసాలకు మామూలు ప్రజలే కాదు.. సెలబ్రెటీలు కూడా మోసపోతున్నారు. ఇందుకు బాలీవుడ్ నటి అంజలి పాటిల్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల దీపక్ శర్మ అని చెప్పుకున్న ఒక వ్యక్తి నటి అంజలి పాటిల్కు ఫోన్ చేసి మీ ఆధార్ కార్డుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చింది.. మీరు ముంబై సైబర్ పోలీసులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ముంబై సైబర్ పోలీస్ ఆఫీసర్ బెనర్జీని అంటూ మరో వ్యక్తి కాల్ చేశాడు. మీ ఆధార్ నంబర్తో లింక్ చేయబడిన మూడు బ్యాంకు ఖాతాల్లో అక్రమంగా నగదు బదిలీ జరిగిందని తెలిపాడు. దాన్ని ధ్రువీకరించేందుకు రూ.96,525 తమ ఖాతాకు పంపించాలని సూచించాడు. భయపడిన అంజలి వాళ్లు చెప్పినట్టే చేసింది. దాని తర్వాత మళ్లీ కాల్ చేసిన బెనర్జీ తనపై డ్రగ్స్ కేసుతో పాటు మనీలాండరింగ్ కింద కేసులు బుక్ చేయాల్సి ఉంటుందని చెప్పి.. కేసు క్లోజ్ చేసేందుకు రూ.4,83,291 తన అకౌంట్కు పంపించాలని చెప్పాడు. ఆ కేటుగాడు చెప్పింది నిజమే అని నమ్మి అంజలి డబ్బులు పంపించింది. అలా మొత్తం రూ.5.79 లక్షలు మోసపోయింది. తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన అంజలి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.