హైదరాబాద్, జనవరి 10 : ‘చెయ్యెత్తండి..బస్సెక్కండి’ ఒకప్పటి నినాదం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ‘కాల్ చేయండి.. మీ ఇంటివద్దకే బస్సు పంపుతాం’.. ఇదీ టీఎస్ఆర్టీసీ నూతన విధానం. ఒకప్పుడు ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయాణికులు కోరిన చోట బస్సులు ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసి ప్రయాణికుల ఇంటివద్దనే సేవలందించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే వారి కాలనీ, వారి ఏరియాకే బస్సును ఎలాంటి అదనపు చార్జీ లేకుండానే పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రయాణికులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సజ్జనార్ ట్వీట్ చేశారు. సమాచారం కోసం ఎంజీబీఎస్: 9959226257, జేబీఎస్: 9959226246, రేతిఫైల్ బస్స్టేషన్: 9959226154, కోఠి బస్స్టేషన్: 9959226160 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.