హైదరాబాద్, మార్చి 12 : సంస్థ సేవలు మెరుగుపర్చేందుకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రయాణికులు, పౌరులను టీఎస్ ఆర్టీసీ కోరుతున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్లైన్లో ఓ సర్వేను నిర్వహిస్తున్నది. ఆర్టీసీ బస్సుల పనితీరు, అందుతున్న సేవలు, సిబ్బంది ప్రవర్తన, హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు, నగరంలోని పలు ప్రాంతాలకు బస్సు సర్వీసుల అందుబాటు.. ప్రజలు వాడుతున్న ప్రయాణ సాధనాలు, ఆర్టీసీ బస్సుల్లో ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు, టికెట్ ధరలు ఇలా అనేక అంశాలపై 35 వరకు ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ సర్వేకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ఖాతాలోని లింక్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనేలా ఏర్పాటుచేశారు.