హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి ఈ సంక్రాంతి లాభాల సంబురం తెచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని నడిపిన అదనపు బస్సులతో రూ.107 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం వెల్లడించింది. ప్రయాణికుల నుంచి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా, నాలుగువేల స్పెషల్ బస్సులు నడిపి దాదాపు 55 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది. ఈ నెల ఏడు నుంచి సాధారణ సర్వీస్లకు తోడుగా స్పెషల్ బస్సులను తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఏపీలోని పలు ముఖ్యపట్టణాలు, నగరాలకు నడిపింది. దీంతో సగటున రోజుకు రూ. 9.75 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. దసరా సమయంలో కూడా ఆర్టీసీ ఇదేవిధంగా సేవలందించింది. ఏపీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలకు అదనంగా 50 శాతం వసూలు చేయడంతో ఏపీ ప్రయాణికులు సైతం టీఎస్ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. ప్రజలు టీఎస్ఆర్టీసీని ఆదరించడంపై సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
సంక్రాంతి పండుగ రోజుల్లో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై భారీగా టోల్ వసూల్ అయ్యింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పండుగ కోసం సొంత గ్రామాలకు పెద్దఎత్తున రాకపోకలు సాగించారు. కేవలం 13, 14, 15 తేదీల్లోనే రాష్ట్రంలోని 28 టోల్గేట్ల మీదుగా 7,55,402 వాహనాలు ప్రయాణించాయి. దీంతో టోల్గేట్ల వద్ద రూ.11,72,18,685 వసూలైంది. ఇందులో 97 శాతానికి పైగా ఫాస్ట్ట్యాగ్ ద్వారానే వచ్చినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్లోని పంతంగి టోల్ప్లాజా వద్ద మూడురోజుల్లో 95,151 వాహనాలు రాకపోకలు సాగించాయి.