హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 19 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: టీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, రక్షణలో నూతన కానిస్టేబుళ్లు తమ కర్తవ్యాన్ని విస్మరించవద్దని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 166 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల శిక్షణ ఆదివారం ముగిసింది. హైదరాబాద్ కొండాపూర్లోని 8వ బెటాలియన్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎండీ సజ్జనార్తో కలిసి హాజరైన చైర్మన్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కానిస్టేబుళ్లు సంస్థకు కండ్లు, చెవుల లాంటివారని, క్రమశిక్షణతో పనిచేయాలని, కర్తవ్యాన్ని విస్మరించొద్దని సూచించారు. సంస్థలోని 50 వేల మంది సిబ్బందిని, బస్సులను కాపాడాల్సిన బాధ్యత కానిస్టేబుళ్లపైనే ఉందని గుర్తు చేశారు. ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల ఏరోబిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణలోప్రతిభ కనబరిచిన సృజన్ (బెస్ట్ ఆల్రౌండర్), రమాదేవి (బెస్ట్ ఇండోర్), పూజిత, సాయికిరణ్ (బెస్ట్ ఔట్ డోర్)కు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేడీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.