TSRTC | ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆ పథకం అమలులో వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. రద్దీకి అనుగుణంగా బస్సులను నడపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మహిళలు కనిపిస్తే బస్సులు ఆపకుండా వెళ్తుండగా.. తాజాగా ఓవర్లోడ్ అయ్యిందనే సాకుతో దారి మధ్యలోనే దింపేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో తాజాగా గురువారం రాత్రి జరిగిన సంఘటనే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు పాత బస్టాండ్ నుంచి బయల్దేరింది. అయితే జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో గల నల్లగుట్ట వద్దకు రాగానే 10 మంది మహిళలను ఆర్టీసీ కండకర్ట్ దింపేశాడు. అడిగితే బస్సులో ప్రయాణికులు ఓవర్లోడ్ అయ్యారని, టికెట్లు ఇచ్చే మిషన్ నుంచి టికెట్లు రావడం లేదని సాకు చెప్పాడు. దారి మధ్యలోనే దింపేసి వెళ్లడంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది గమనించిన స్థానికులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని బస్సు ఎక్కించారు. అయితే ఈ బస్సులోనూ ఓవర్లోడ్ అయ్యిందని కండక్టర్ చెప్పి తప్పించుకోబోయాడు. కానీ తిమ్మాపూర్ గ్రామస్తులు కలగజేసుకుని కండక్టర్ను బతిమిలాడటంతో చివరకు ఒప్పుకున్నారు.