హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగకు బస్ చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండబోదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. పండుగకు సొంత ఊర్లకు వెళ్లేవారు ఆర్టీసీ బస్సుల్లో సంతోషంగా వెళ్లవచ్చని సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రైవేటు వాహనాల్లో అదనపు ధరలు చెల్లించి, ప్రమాదకరమైన ప్రయాణం చేయకుండా ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. బస్సుల్లో కండక్టర్లు రూ.10 కాయిన్లను సైతం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చార్జీల పెంపు లేదని వివరించేలా సినీ హీరో మహేశ్బాబు, నటుడు పృథ్వీరాజ్ల మధ్య సంభాషణతోపాటు, బస్సుల్లో చెత్త వేయవద్దని సూచిస్తూ రూపొందించిన చిత్రాలను ఎండీ తన ట్వీట్కు జత చేశారు. ఆ చిత్రాలు నెటిజన్ల ఆకర్షిస్తున్నాయి.