TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం( Telangana State ) లోని తిరుమల( Tirumala ) వెంకన్న భక్తులు, పర్యాటకులు టీఎస్ ఆర్టీసీ బస్సులను( RTC Buses ) ఆదరించడం సంతోషంగా ఉందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్( Bajireddy Govardhan ) పేర్కొన్నారు. టీటీడీ భక్తులు, పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకొని టీటీడీ( TTD ) బోర్డు చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి( SV Subbareddy ) సహాయ సహకారాలతో టీఎస్ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్తో పాటు రూ. 300 ప్రత్యేక శీఘ్ర దర్శన టికెట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిది నెలల కాలంలో 1,14,565 ప్రయాణికులను విజయవంతంగా తిరుమల తిరుపతి వెంకన్న వద్దకు సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో చేర్చడం చాలా సంతోషంగా ఉందని సంస్థ చైర్మన్ వెల్లడించారు.
తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే టీటీడీ భక్తులు.. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి, స్వామి వారిని దర్శించుకోవాలని సూచించారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు వారం రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తిరుమల వెంకన్న వద్దకు ఈ యొక్క ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు సుమారు 1000 మందిని తిరుమల వెంకన్న వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అప్ అండ్ డౌన్ టికెట్ సౌకర్యంతో పాటు దర్శనం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ప్రయాణికులకు సురక్షితమైన, సుఖవంతమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి వెంకన్న చెంతకు వెళ్లే భక్తులు మరిన్ని వివరాల కోసం టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.