హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన ఆర్టీసీ పరిస్థి తయారయ్యింది. కరోనా ప్రభావంతో టీఎస్ఆర్టీసీ ఇప్పటికే భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు బస్సులు ఎక్కడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్యాసింజర్ సర్వీసులను చాలా వరకు తగ్గించుకున్నది. అంతో ఇంతో లాభాలు తెచ్చిపెడుతున్న పార్శిల్, కార్గొ సర్వీసులపై కూడా కరోనా ప్రభావం పడింది. కార్గో, పార్శిల్ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పొరుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్తో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు కుదుటపడే వరకు కార్గో సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు అందిస్తున్నది. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ అమల్లో ఉన్నది. నష్టాల నుంచి బయటపడేందుకు గతేడాది జూన్ 19న టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించింది. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి