TSRTC | హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. ప్రమాద సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.
వెనుక చక్రాలు ఊడిపోయి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టైర్లు ఊడిపోయి బస్సు ఓ పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డాయి. ఈ సమయంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఓవర్లోడ్ కారణంగానే బస్సు చక్రాలు ఊడిపోయాయని ప్రయాణికులు చెబుతున్నారు. 55 మంది వెళ్లాల్సిన ఈ బస్సులో దాదాపు 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.