రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని గంభీరావుపేట వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. లోలెవల్ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు నిన్న చిక్కుకున్న విషయం విదితమే. ఆ బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. ఇవాళ ఉదయం వరకు వరద ఉధృతి ఎక్కువ అవడంతో బస్సు నీటిలో కొట్టుకుపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి 25 మంది ప్రయాణికులతో గంభీరావుపేట మీదుగా సిద్దిపేటకు వెళ్తున్నది. ఈ క్రమంలో సోమవారం కురిసిన వర్షానికి నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. శివారులోని లోలెవల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తున్నది. అయితే డ్రైవర్ గమనించకుండా బస్సును లోలెవల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జి అంచున బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.