హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరాలకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు 2 గంటలు, తర్వాత 2 గంటల పాటు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్ చూపించి సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 040-30102829, 68153333 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.