TSRTC | హైదరాబాద్ ప్రయాణికులను మరింతగా ఆకట్టుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్కు పోటీగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. టికెట్లపై వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. అలాగే వివిధ పర్యాటక ప్రదేశాలకు స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీని టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది. టూర్ప్యాకేజీలో భాగంగా ప్రతీ వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపనున్నది.
రెండు రోజుల పాటు ఈ టూర్ సాగనున్నది. శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయంతో పాటు భ్రమరాంబదేవి, పాతాళగంగ, శ్రీశైలం డ్యామ్, శిఖరం, పంచదార, పాలదార, సాక్షి గణపతి ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఈ ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ.2700, పిల్లలకు రూ.1570గా నిర్ణయించారు. ఈ నెల 22న ఈ ప్రత్యేక బస్సులను ప్రారంభించనున్నారు. వీకెండ్స్లో హైదరాబాద్లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు ఈ బస్సులు బయలుదేరనున్నారు. 8 గంటలకు ఎంజీబీఎస్లో అందుబాటులో ఉండనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలం చేరుకుంటాయి.
మధ్యాహ్నం 3 గంటలకు పాతాళగంగ సందర్శనతో పాటు బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మల్లిఖార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. రాత్రి హోటల్లో బస సదుపాయం ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం శ్రీశైలం డ్యామ్, పంచధార, శిఖరం, సాక్షి గణపతి ఆలయం సందర్శనకు వెళ్తారు. ఆ తర్వాతి రాత్రి 8 గంటలకు హైదరాబాద్కు బస్ చేరుకుంటుంది. ఆలయ దర్శనం, హోటల్ వసతి ఈ ప్యాకేజీ ధరలో కల్పించనున్నారు. ఆహారం, ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాల్సి ఉంటుంది.
టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి శ్రీశైలం ప్రత్యేక ప్యాకేజీ టికెట్లను బుక్ చేసుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం వెళ్తుంటారు. శని, ఆదివారాల్లో శ్రీశైలానికి వెళ్లే బస్సుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు దాదాపు 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. అయినా, భక్తుల రద్దీకి తగ్గట్లు బస్సులు సరిపోవడంలేదు. దీంతో మరిన్ని ప్రత్యేక బస్సులను తిప్పనుంది. కాగా, ఇప్పటికే తిరుమల వెళ్లే టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా అందిస్తోంది. ఇప్పుడు శ్రీశైలం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మల్లికార్జునస్వామి వారి దర్శనం కల్పించనుంది.