హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని… ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. కానీ తమిళిసై మాత్రం ప్రత్యర్థి పార్టీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, గౌరవప్రదమైన రాజ్ భవన్ను ఓ పార్టీ ఆఫీసులా మార్చేశారని మండిపడ్డారు.
బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడి గవర్నర్లను తోలుబొమ్మలుగా వాడుతోందనేది జగమెరిగిన సత్యమన్నారు. అందుకే ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కంటే ముందు మాట్లాడిన ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు గవర్నర్ల తీరును తప్పుపట్టారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీయడం, వాటిని కూల్చేయడమే లక్ష్యంగా ఢిల్లీలోని మోదీ, అమిత్ షా చెప్పుచేతల్లో గవర్నర్లు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ చెప్పినట్టు ఆమె ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటే.. ముఖ్యమైన ఏడు బిల్లులను ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంప్రదింపులు, సవరణలు అంటూ ఎంతకాలం వాటిని కోల్డ్స్టోరేజ్లో పెడతారని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న ఆ 7 బిల్లులు పాస్ అయితే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడే పరిస్థితి లేదన్నారు. అందుకే దురుద్దేశపూర్వకంగానే గవర్నర్ తమిళిసై.. అసెంబ్లీలో పాసైన బిల్లులను పక్కనపెట్టేశారని ఆరోపించారు.
గవర్నర్ తమిళిసై నిజంగా ప్రజల పక్షపాతి, సంక్షేమాన్ని కోరుకునే వారే అయితే వెంటనే బిల్లులకు ఆమోదం తెలపాలన్నారు. కానీ గవర్నర్కు రాజకీయ ఉద్దేశం తప్ప.. ప్రజల సంక్షేమంపై పట్టింపు లేదన్నారు. అందుకే బిల్లుల కంటే కూడా తనకు ప్రోటోకాలే ముఖ్యమంటూ మాట్లాడటం.. ఆమె దురుద్దేశాన్ని సుస్పష్టం చేస్తున్నదని సతీష్ రెడ్డి విమర్శించారు.