Satish Reddy on Tamilisai | గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను కాస్తా బీజేపీ ఆఫీసులా మార్చారని టీఎస్ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో ఉన్న గవర్నర్.. బీజేపీకి చెందిన రాజకీయ చర్చల్లో పాల్గొనడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయాన్ని గవర్నర్ మరిచిపోయినట్టున్నారని ఆయన దుయ్యబట్టారు.
‘2024 ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ వ్యూహం’ అనే అంశంపై తమిళనాడు బీజేపీకి చెందిన వ్యక్తులు ట్విట్టర్ స్పేస్ వేదికగా ఇటీవల చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గవర్నర్ తమిళిసై కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తున్నది. ట్విట్టర్ స్పేస్ చర్చలో తమిళిసై పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. ఆ చర్చలో పాల్గొనలేదని బుకాయిస్తూ గవర్నర్ కార్యాలయం ప్రెస్ నోట్ ఇవ్వడం దారుణమని సతీష్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
గతంలో కూడా తమిళిసై బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలిలా మాదిరిగానే ఆరోపణలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం మర్చిపోలేదన్నారు. ఇకనైనా గవర్నర్ తమిళిసై తన పద్ధతి మార్చుకుని రాజ్ భవన్ గౌరవాన్ని కాపాడాలని సతీష్ రెడ్డి సూచించారు.