TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 21వ తేదీన ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
మే 21, 22వ తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్ పద్ధతిని పాటించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
Read More: TSPSC | టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ కేసు.. తండ్రీకొడుకులు అరెస్ట్
ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్ను 2022 సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం విదితమే. ఈ పోస్టులకు 44,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.