TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2022, ఏప్రిల్ నెలలో గత ప్రభుత్వం 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు సార్లు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు కావడంతో.. ఈ ప్రభుత్వం మరో 60 పోస్టులను కలిపి 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గత నోటిఫికేషన్ రద్దు కావడంతో.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోకపోతే.. అలాంటి అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని, ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు.
ఆన్లైన్లో అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు
అప్లికేషన్లు ఎడిట్ చేసుకునే అవకాశం- మార్చి 23 నుంచి 27 వ తేదీ వరకు
ప్రిలిమినరీ పరీక్ష – మే/జూన్ 2024
మెయిన్స్- సెప్టెంబర్/అక్టోబర్ 2024