TSPSC | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో కొత్త సంస్కరణలకు కసరత్తు జరుగుతున్నది. కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో దిద్దుబాటు చర్యలను కమిషన్ ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రధానంగా టీఎస్పీఎస్సీలో మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లకు అనుమతి ఇవ్వకూడదని భావిస్తున్నది. ఉద్యోగులు సైతం మొబైల్ ఫోన్లను సెక్యూరిటీ వద్దే ఉంచి వెళ్లాలనే నిబంధన తీసుకురావాలని అనుకుంటున్నది. హైదరాబాద్లోని నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బీ జనార్దన్రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కమిషన్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఉద్యోగుల నియామకం, ఆన్లైన్ పరీక్షలు తదితర అనేక అంశాలపై భేటీలో ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది.