హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీపై సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ దర్యాప్తు నివేదికను సీల్డ్కవర్లో హైకోర్టుకు సమర్పించింది. మొత్తం 17 మంది నిందితుల్లో 16 మందిని అరెస్టు చేసినట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. మరో నిందితుడు న్యూజిలాండ్లో ఉన్నాడని, ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించిందని తెలిపారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్నర్సింగ్రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పరీక్షలకు హాజరైనట్టు వార్తలు వచ్చాయని న్యాయమూర్తి పేర్కొంటూ.. వారిని ఏవిధంగా పరీక్షలకు అనుమతించారని ప్రశ్నించారు.
దీనిపై ఏజీ స్పందిస్తూ.. పరీక్షలు రాసేవారిని పరీక్షల నిర్వహణకు దూరంగా పెట్టామని, మెటీరియల్, ఇతర అంశాలతో వారికి సంబంధం లేదని చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు ఇతర వివరాలు అందాల్సి ఉన్నదన్నారు. సిట్ దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు మధ్యలో ఉన్నప్పుడు నివేదికను బహిర్గతం చేయడానికి వీల్లేదన్నారు. ఆ నివేదికను బహిర్గతం చేస్తే సిట్ దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కోర్టు అవగాహన కోసమే సీల్డ్కవర్లో నివేదికను అందజేసినట్టు తెలిపారు. దీంతో పిటిషనర్ న్యాయవాది విజ్ఞప్తిని న్యాయమూర్తి సైతం తప్పుపట్టారు. చార్జిషీట్ను దాఖలు చేసిన తర్వాతే ఆ నివేదిక పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుందని స్పష్టం చేశారు. అనంతరం నిందితుల వివరాలు, వారికి ఈ కేసుతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై నోట్ తయారుచేసి అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులుగా ఉన్నవారు పరీక్ష ఎలా రాస్తారో చెప్పాలని కోరుతూ.. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.