సిటీబ్యూరో, ఆగస్టు 3 ( నమస్తే తెలంగాణ ): 19వేల పోలీస్ ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఇందిరాపార్క్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. 7,437 పోస్టులతో కాకుండా 19వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో జేఏసీ నేతలు కొడంగల్ రవి, మధుసూదన్, శ్రీకాంత్ రాథోడ్, విరేశ్, కరుణాకర్, ప్రతాప్, శివ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.