హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంగళవారం సిట్ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్లోని ఇంట్లో ఆయన లేకపోవడంతో నివాసం వద్ద నోటీసులను అంటించారు. ‘జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా గ్రూప్-1లో క్వాలిఫై అయ్యారు.
అందులో బీఆర్ఎస్ నేతల కొడుకులు, నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు జడ్పీటీసీ వద్ద బాడీగార్డుగా పనిచేసే వ్యక్తి కొడుకు. ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కొడుకుకు అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై అయ్యాడు’ అని చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో సిట్ పేర్కొన్నది. పూర్తి సమాచారం సిట్కు ఇచ్చి దర్యాప్తుకు సహకరించాలని, అందుకు 24వ తేదీ ఉదయం 11 గంటలకు హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయంలో హాజరుకావాలని బండికి ఆదేశాల్లో పేర్కొన్నది.