TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో తాజాగా అరెస్టయిన ముగ్గురితోపాటు ఆరు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి చేసుకొన్న తొమ్మిది మంది నిందితులను గురువారం సిట్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 పేపర్ను కూడా లీక్ చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. రాజశేఖర్రెడ్డి టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న రమేశ్, షమీమ్లకు పేపర్ను అందించగా, ప్రవీణ్కుమార్ టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి అయిన సురేశ్కు ప్రశ్నపత్రాలను అందించినట్టు విచారణలో వెల్లడైంది.
రమేశ్ బోర్డు మెంబర్కు పీఏగా పనిచేస్తుండగా, షమీమ్ 2013లో గ్రూప్-2 పరీక్ష రాసి టీఎస్పీఎస్సీలో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆమె టీఎస్పీఎస్సీలోని గ్రూప్-4 పరీక్షల నిర్వహణ సెక్షన్లో పనిచేస్తున్నది. ఈ ఇద్దరికి 122 మార్కుల కంటే ఎక్కువగా వచ్చినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ముగ్గురిని గురువారం సిట్ అరెస్టు చేసింది. వీళ్ల ద్వారా మరెంత మందికి పేపర్ వెళ్లిందనే విషయంపై దృష్టి పెట్టింది. సిట్ రెండు రోజులుగా గ్రూప్-1లో 100 మార్కుల కంటే ఎక్కువగా మార్కులు సాధించిన వారిని ప్రశ్నిస్తుంది. తాజాగా మరో 25 మందిని విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, రేణుక దంపతుల పాత్రనే కీలకం కావడంతో వీరిని కూడా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరే అవకాశాలున్నాయి. తాజాగా అరెస్టయిన రమేశ్, షమీమ్, సురేశ్ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని సిట్ విచారించనున్నది. ఎల్బీనగర్లోని షమీమ్ ఇండ్లలో సిట్ అధికారులు గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు.
రాజశేఖర్రెడ్డి తన వద్ద ఉన్న ఐదు పెన్ డ్రైవ్లకు పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవగా, వాటిని ఓపెన్ చేసేందుకు సిట్ అధికారులను పాస్వర్డ్ మర్చిపోయానంటూ బోల్తా కొట్టించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. నిందితులు సరైన సమాధానాలు చెప్పకపోతే సాంకేతిక అంశాలతో వారి నుంచి సమాధానాలను రాబట్టినట్టు సమాచారం. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి దానిని రేణుక దంపతులకు ఇచ్చారు. దానిని నీలేశ్, గోపాల్ కొని రెండు రోజులు మహబూబ్నగర్లో రేణుక సమక్షంలో ఉండి పరీక్షకు సిద్ధమై, నేరుగా సరూర్నగర్లోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎల్బీనగర్లో ఒక లాడ్జి వద్ద వీరంతా ఆగారు. అక్కడ ఒకరిద్దరు వ్యక్తులను కలిశారు. వారెవరు అనే విషయంపై సిట్ ఆరా తీస్తున్నది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్-1 ప్రశ్నప్రతాలను విదేశాలకు కూడా పంపినట్టు తెలిసింది. అతడి బంధువులు విదేశాల నుంచి వచ్చి మరీ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. పలువురు విదేశాల్లో ఉంటూ గతంలో ఇక్కడ గ్రూప్-1 పరీక్షను రాసివెళ్లారు. రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి విదేశాల్లో ఉన్న తమ బంధువులను అప్రమత్తం చేసి పరీక్ష రాయాలని సూచించారు. తాను టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నందున ప్రశ్నపత్రం దొరుకుతుందని పరీక్ష రాసి పొమ్మంటూ దరఖాస్తులు చేయించాడు. న్యూజిలాండ్లో ఉంటున్న తన బామ్మర్థి ప్రశాంత్ హైదరాబాద్కు చేరుకొని గ్రూప్-1 పరీక్ష రాశాడు. ఇతడికి 100కు పైగా మార్కులు వచ్చినట్టు సిట్ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజశేఖర్రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది.