TSPSC | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి బాటలోనే సభ్యులు కూడా ముందుకెళుతున్నారు. ఇటీవలే జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా.. తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్ సత్యనారాయణ తన రాజీనామాను సమర్పించారు. శుక్రవారం మరో ఇద్దరు సభ్యులు కారం రవీందర్రెడ్డి, లింగారెడ్డి రాజీనామా చేశారు. మూడు రోజులుగా గవర్నర్ అపాయింట్మెంట్ అడుగుతుండగా, ఎటువంటి స్పందన లేదు. దీంతో సభ్యులిద్దరూ తమ రాజీనామా లేఖలను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్తోపాటు మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ప్రస్తుతం సుమిత్ర ఆనంద్ తానోబా, అరుణ కుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం నుంచి టీఎస్పీఎస్సీ సభ్యుడిగా తనకు ప్రజలు, నిరుద్యోగుల పక్షాన పోరాటమే తప్ప, పొరపాట్లు చేయడం అలవాటు లేదని కారం రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా రాజీనామా చేసిన తర్వాత గురువారం ఆయన ఓ ప్రకటన చేస్తూ `ఈ రోజు నేను టీఎస్పీఎస్సీ సభ్యునిగా 30 నెలలకు పైగా సేవలందించిన నేను తప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఈ కాలంలో నాకు సహకరించిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, కమిషన్ అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు చేసిన తప్పిదం మొత్తం కమిషన్ను తప్పుబట్టే స్థాయికి తెచ్చింది. ఇద్దరి స్వార్థంతో జరిగిన తప్పును కమిషన్కు ఆపాదించే ప్రయత్నం చేశారు. దీన్ని కొందరు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుని మాపై పదే పదే అక్కసుతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు` అని తెలిపారు.
`నిరుద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పంతో టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించా. కానీ టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తుల తప్పిదంతో సంస్థ మనుగడకే నష్టం వాటిల్లింది. అయినా నిరుద్యోగులకు తొందరగా ఉద్యోగాలు కల్పించడానికి కష్టపడి పనిచేశాం. దేశంలో ఏ పీఎస్సీ చేయని ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చాం. ఎంతో పారదర్శకతను ప్రవేశపెట్టాం. నిరుద్యోగులు ఇకనైనా అపోహలు వీడాలి. విశ్వాసంతో ముందుకు సాగండి. మేమెప్పటికీ ఉద్యమ కారులమే. మేమెప్పటికీ నిరుద్యోగుల పక్షమే. జై తెలంగాణ`అని పేర్కొన్నారు.