హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2, 3, 4 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి శుక్రవారం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివా రం సమావేశమైంది. నోటిఫికేషన్, రోస్టర్ తదితర అంశాలపై చర్చించింది. గతంలో ఆరు శా తం ఉన్న గిరిజన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభు త్వం 10 శాతానికి పెంచింది. తద్వారా గిరిజనులకు 6 శాతంగా ఉన్న రోస్టర్ పాయింట్లు.. ప్రస్తుతం 10 శాతానికి పెరిగాయి. కొత్తగా మారనున్న రిజర్వేషన్లపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డితోపాటు సభ్యులు చర్చించారు.
గ్రూప్-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ మేల్, జువనైల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా చేర్చింది.
గతంలో గ్రూప్-2, 3, 4లో ఉన్న పోస్టులేంటి? కొత్తగా జతచేసిన పోస్టులెన్ని? వంటి అంశాలకు కూలంకషంగా చర్చించారు. సోమవారం గ్రూప్-4పై టీఎస్పీఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. అన్ని శాఖల అధికారులు ఇండెంట్లతో సమావేశానికి రావాలని టీఎస్పీఎస్సీ ఆదేశించినట్టు తెలిసింది. మరో రెండు వారాల్లో గ్రూప్-4 నోటిపికేషన్ ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నది. ఆ వెంటనే గ్రూప్-2, ఆ తర్వాతే గ్రూప్-3, 4 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.