TSPSC | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఇకపై జరుగబోయే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష మొదలుకొని మిగిలిన అన్ని పరీక్షలకు కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలని భావిస్తున్నది. టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల కోసం ఇప్పటికే కొన్ని ప్రశ్నపత్రాలు సిద్ధం చేయగా, మరికొన్ని ప్రశ్నల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేయాలని కమిషన్ నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలు ఎంపిక చేయాలని అనుకుంటున్నది. సాధారణంగా.. ప్రశ్నల ఎంపికకు కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటివన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కు సైతం ఒకరికి మరొకరికి సంబంధం ఉండదు. కొన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రశ్నపత్రాలతోపాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను సైతం మార్చాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది.
తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ దిశగా నియామక సంస్థలు శరవేగంగా పనిచేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 17,136 ఉద్యోగాల భర్తీకి 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో ఇప్పటికే ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష జరుగగా, ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో ఆ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 12న జరుగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను కూడా వాయిదా వేసినట్టు ప్రకటించింది.
ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఉన్నది. ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ), ఏప్రిల్ 25న అగ్రికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 26, 27 తేదీల్లో గెజిటెడ్ ఆఫీసర్ (గ్రౌండ్ వాటర్), మే 7న డ్రగ్ ఇన్స్పెక్టర్, మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్, మే 15, 16 తేదీల్లో నాన్ గజిటెడ్ ఆఫీసర్ (గ్రౌండ్ వాటర్), మే 17న ఫిజికల్ డైరెక్టర్స్, జాన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్, జూలై 1న గ్రూప్ -4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలతోపాటు ఇతర పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి జరుగాల్సిన పరీక్షలన్నీ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది.