TSPSC | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆకాంక్షే.. నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో మొదటి రెండు ఇప్పటికే సాకారం చేసుకున్నాం. మూడోది చివరి దశకు చేరింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేవలం తొమ్మిదేండ్లలో 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ.. దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నది. ఉద్యోగాల భర్తీలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎన్నో మార్పులు చేసింది. గతంలో ఏపీపీఎస్సీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఎన్నో గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
టీఎస్పీఎస్సీకి సమర్థులైన వ్యక్తులను చైర్మన్లుగా నియమించింది. టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసిన వెంటనే తెలంగాణ ఆకాంక్ష, యువత ఆశలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. నిజాయితీ, నిబద్ధత, సమర్థత కలిగిన వారికి చైర్మన్గా బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి టీఎస్పీఎస్సీ చైర్మన్గా పేద పిల్లల కష్టనస్టాలు తెలిసిన వ్యక్తి, ఉద్యమ ఆకాంక్షల కోసం శ్రమించిన వ్యక్తి, దళితుడు, మేధావి, ప్రొఫెసర్ గంటా చక్రపాణిని నియమించింది.
ఆ తర్వాత రెండోసారి విశ్వసనీయత, సర్వీసులో ఎటువంటి మచ్చలేని ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. రెండుసార్లు కమిషన్లో సభ్యులను కూడా ఆ దిశగానే నియమించింది. వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ యువతను ప్రభుత్వ ఉద్యోగం వైపు నడిపించింది. ఒక్క ఆరోపణ కూడా లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఉద్యోగాలు సాధించిన వారందరూ తెలంగాణ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగం సాధించిన వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. తొమ్మిదేండ్ల తర్వాత ప్రస్తుతం ఒక్క ఉదంతం జరిగింది. ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రతిపక్షాలు దీన్ని పావుగా వాడుకుంటున్నాయి. యువత భవిష్యత్తును రాజకీయ స్వార్థం కోసం బలిచేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణ యువత కలలను సాకారం చేయాలనే నిబద్ధతతో ముందుకెళుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.
గత తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం 1.33 లక్షల ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించింది. దీనితోపాటు నిరుడు మార్చి 9న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ యువతకు మరోసారి తీపి కబురు చెప్పారు. ఒకేసారి 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మరో 7,029 ఉద్యోగాలను మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. దీంతోపాటు 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను పూర్తిచేసింది. మొత్తంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలోనే అతితక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన, నిష్పక్షపాతంగా పనిచేస్తున్న కమిషన్గా టీఎస్పీఎస్సీ కీర్తి గడించింది.
టీఎస్పీఎస్సీ కృషిని దేశం కొనియాడుతున్నది. దేశంలోని అనేక పబ్లిక్ సర్వీస్ కమిషన్లు టీఎస్పీఎస్సీ విధానాలను కీర్తిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కొత్తగా ప్రవేశపెట్టిన వాటిలో వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ఒకటి. ఒక్కసారి టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ చేసుకుంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్లు మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. కేవలం అభ్యర్థి దరఖాస్తు చేయాలి అనుకుంటున్న ఉద్యోగానికి పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇది అభ్యర్థులకు ఒక వరం వంటిది. గతంలో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయలన్నా, ప్రతిసారీ సర్టిఫికెట్లు ఇతర వివరాలన్నీ నమోదు చేసుకోవాల్సి వచ్చేది.
కానీ, టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన ఓటీఆర్తో నిమిషాల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటీఆర్ను ఇటీవలే యూజీసీ చైర్మన్ సైతం కొనియాడారు. ఓటీఆర్ ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ అని, ఇది దేశమంతా అన్ని పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అనేక రాష్ర్టాల కమిషన్లు ఓటీఆర్ అమలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలతో జరుగుతున్న అన్యాయాలకు చెక్పెట్టేందుకు అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దుచేసింది. కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక జరగాలనే సదుద్దేశంతో ఇంటర్వ్యూలను రద్దు చేశారు.
గతంలో ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు పరీక్షల సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సమాచారం ఇచ్చేవారు. కుదిరితే ఒకటి, రెండుసార్లు సమీక్ష నిర్వహించేవారు. కానీ, టీఎస్పీఎస్సీ చైర్మన్గా జనార్దన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్తోపాటు ఇతర పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు అందరికీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్విజిలేటర్లకు కూడా మాట్లాడేందుకు సమయం ఇచ్చారు. వారు చెప్పిన సమస్యలు, సలహాలు, సూచనలను సైతం పాటించారు. ఇదేవిధానాన్ని మిగిలిన అన్ని పరీక్షలకు పాటిస్తున్నారు.
ఉమ్మడి పాలనలో నోటిఫికేషన్లు సరిగా రాకపోవటంతో ఎంతోమంది ఏండ్ల తరబడి ఉద్యోగానికి ప్రిపేర్ అయినప్పటికీ ఫలితం ఉండేది కాదు. చివరికి తెలంగాణ ఏర్పడి కేసీఆర్ వరుస నోటిఫికేషన్లు ఇస్తుంటే.. దరఖాస్తు చేసుకోవడానికి వయసు అయిపోయిందని అనేక మంది బాధ పడేవారు. అందుకే, పోలీస్ శాఖలో మినహా మిగిలిన అన్ని రకాల ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమిని పదేండ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల తెలంగాణలో లక్షలాది మందికి మళ్లీ ఉద్యోగం కోసం పోటీ పడే అవకాశం దొరికింది.
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఒక్కో ఉద్యోగానికి 50 మందిని పికప్ చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగానికి వందమందిని సెలక్ట్ చేయాలని కొందరు అవగాహన లోపంతో అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు. దేశంలో గ్రూప్-1 ఉద్యోగం కోసం మెయిన్స్కు ఎక్కువ మందిని పికప్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే. మిగిలిన రాష్ర్టాల్లో 1:10 నుంచి 1:20 వరకు మాత్రమే మెయిన్స్కు పికప్ చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం అభ్యర్థులు ఎక్కువ మందిని మెయిన్స్కు పంపించాలని, తద్వారా గ్రూప్-1 ఎంపికలు మరింత సమర్థవంతంగా జరుగుతాయని కమిషన్ భావించింది. అందుకే 1:50 రేషియోలో ఎంపిక చేస్తున్నది.
దేశంలోనే తొలిసారిగా పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందు పరుస్తున్నది. దీనితోపాటు ఓఎంఆర్ షీటు అందుబాటులో ఉండటం వల్ల అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఎక్కడెక్కడ తప్పులు దొర్లాయి? వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఈ ప్రక్రియతో పారదర్శతకు టీఎస్పీఎస్సీ పెద్దపీట వేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ ఓఎంఆర్షీట్ల మూల్యాంకనం అంతా కంప్యూటర్ల ద్వారానే చేశారు. దీనివల్ల గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో మానవ ప్రమేయాన్ని అరికట్టగలిగారు. అదేవిధంగా తొలిసారిగా కంప్యూటర్బేస్డ్ పరీక్షలకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది.
టీఎస్పీఎస్సీ తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో పోటీ పరీక్షలకు ఒకరికి బదులు మరొకరు హాజరై పరీక్ష రాసేవారనే ఆరోపణలు ఉండేవి. దానికి చెక్ పెట్టేందుకు గ్రూప్-1 పరీక్ష నుంచి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైనప్పుడు ఆ అభ్యర్థి వేలిముద్రలు తీసుకుంటారు. మళ్లీ మెయిన్ పరీక్షకు వచ్చినప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటారు. వేలిముద్ర తీసుకోగానే అభ్యర్థి ఫొటోతోపాటు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ప్రిలిమ్స్ సమయంలోని వేలిముద్రలతో మెయిన్స్ సమయంలో వేలిముద్రలు సరిపోతేనే పరీక్షకు అనుమతిస్తారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రిలిమ్స్ దశలోనే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయాలని చూసేవారిని అడ్డుకున్నది.
గతంలో గ్రూప్-1 పరీక్షకు ఏ,బీ,సీ,డీ సిరీస్ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. అయితే, దీనివల్ల ఆ పరీక్ష హాల్లో ఎవరైనా మాస్కాపీయింగ్కు పాల్పడే అవకాశం ఉండేది. దేశంలోనే తొలిసారిగా మాస్కాపీయింగ్కు చెక్ పెట్టేందకు టీఎస్పీఎస్సీ నాలుగు మించి అనేక సిరీస్ ప్రశ్నపత్రాలు ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్ సాఫ్ట్వేర్తో సాధ్యమైనన్ని దఫాలుగా జంబ్లింగ్ చేసి, ఎకువ సంఖ్యలో సిరీస్ల ప్రశ్నపత్రాలను ముద్రించింది. ఈ మేరకు ఏ,బీ,సీ,డీ సిరీస్ల స్థానంలో ఆరంకెల నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇచ్చింది. దీనివల్ల ఇద్దరు అభ్యర్థులు పక్కపక్కనే కూర్చున్నా, ముందు వెనుక కూర్చున్నా మాస్కాపీయింగ్కు అవకాశం ఉండదు. ఎందుకంటే, 150 ప్రశ్నలను జంబ్లింగ్ చేసి ఇచ్చారు. ఒక అభ్యర్థికి వచ్చిన ఒకటో ప్రశ్న, పక్కనే ఉన్న అభ్యర్థికి అది 10 లేదా 20వ ప్రశ్నగా రావొచ్చు. అదేవిధంగా, ఒక ప్రశ్నకు నాలుగు మల్టిపుల్ చాయిస్లు ఉంటే, ఆ నాలుగు కూడా వేర్వేరుగా వస్తాయి. దీంతో టీఎస్పీఎస్సీ పూర్తిగా మాస్ కాపీయింగ్కు చెక్ పెట్టగలిగింది. మిగిలిన రాష్ర్టాల్లోని కమిషన్లు సైతం ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
టీఎస్పీఎస్సీ తొలిసారిగా ప్రతిసెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ స్థానికంగా ఎవరైనా ప్రభావితం చేయాలని చూసినా.. సీసీ కెమెరాల వల్ల సాధ్యం కాదు. గ్రూప్-1 ప్రిలిమ్స్కు 1,019 సెంటర్లు ఉండగా, ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవకతవకలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పూర్తిగా నిఘానీడన పరీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో ఏడాదికి సగటున 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయడమే గగనంగా ఉండేది. ఒక నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రమంతా ఆందోళనలతో అట్టుడికేది. కోర్టుల్లో పదుల సంఖ్యలో కేసులు వేసేవారు. కానీ.. టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014 నుంచి 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రస్తుతం మరో 23 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. 17,136 ఉద్యోగాలకు ఇప్పటికే 26 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మరో 5,864 ఉద్యోగాలకు సైతం త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది.