Group-2 Exam | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్ష నిర్వహణ కోసం టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లు, గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షల ఫలితాలు, గ్రూప్-3 పరీక్ష తేదీ ఖరారు, కోర్టు కేసులు తదితర అంశాలపై కమిషన్ భేటీ జరిగింది. మంగళవారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డితోపాటు సభ్యులు హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై ఈ వారంలోనే హైకోర్టు కేసు ఓ కొలిక్కి వస్తుందని కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కోర్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఫలితాలు ఇవ్వాలని అభిప్రాయపడినట్టు సమాచారం. గ్రూప్-4 ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ పూర్తయినందున వారం, పదిరోజుల్లో కీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత అభ్యంతరాలకు వారం గడువు ఇవ్వనున్నారు. నిపుణుల కమిటీతో చర్చించి, ఫైనల్ కీ ఇస్తారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే ఫలితాలు ఇవ్వాలనే విషయంపై చర్చించినట్టు సమాచారం. గ్రూప్-3 పరీక్ష తేదీ ఖరారుపై కమిషన్ చర్చించింది.
వారం ముందు నుంచే హాల్టికెట్లు
ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2పై కమిషన్లో కీలకంగా చర్చించినట్టు తెలిసింది. గ్రూప్-2పై ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో చైర్మన్ జనార్దన్రెడ్డి సమావేశాలు నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కూడా దాదాపుగా పూర్తయింది. ఆయా తేదీల్లో పరీక్ష కేంద్రాలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.