TSPSC | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ నవంబర్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. జూలై 1న గ్రూప్-4 పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. కాగా, వారంలో గ్రూప్1‘కీ ’ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. అభ్యంతరాల స్వీరణకు వారం గడువు ఇవ్వాలని నిర్ణయించింది.
అభ్యంతరాల పరిశీలన తర్వాత రెండు మూడు రోజుల్లోనే మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా, ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు గ్రూప్-4లో 8,180 ఉద్యోగాలుండగా, రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. అధిక సంఖ్యలో రాయబోయే పరీక్ష కావడంతో తలెత్తబోయే ఇబ్బందులు, పరీక్ష కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై కమిషన్ చర్చించినట్టు సమాచారం. గ్రూప్1 తరహాలోనే మిగిలిన పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నది.