హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్4 ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ‘కీ’తోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను కూడా https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. సెప్టెంబర్ 27 వరకు ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో ఉంటాయని వివరించారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని సూచించారు. అభ్యర్థులు నేరుగా, పోస్టు లేదా మెయిల్ ద్వారా తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని చెప్పారు. గ్రూప్4 క్యాటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి అత్యధికంగా 9,51,205 దరఖాస్తులొచ్చాయి. జూలై 1న పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 7,63,835 మంది అభ్యర్థులు, పేపర్-2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, గ్రూప్-4 ఫలితాలను అక్టోబర్లో వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది.