హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): స్టేట్ క్యాడర్లో ఐఏఎస్, ఐపీఎస్లతో సమానమైన 563 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ జారీచేసింది. ఇంతకుముందు 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో జారీచేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఆ వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ను రెండుసార్లు నిర్వహించగా, ఆ రెండు పరీక్షలు రద్దయ్యాయి. పేపర్ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్ను ఒకసారి టీఎస్పీఎస్సీ రద్దు చేయగా.. రెండోసారి హైకోర్టు రద్దు చేసింది. ఇటీవల మరో 60 గ్రూప్ -1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు ఈ 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ను విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్షలు మే లేదా జూన్లో, మెయిన్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఈ నెల 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. మార్చి 23 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ఎడిటింగ్కు అవకాశమిచ్చారు. ఈ సారి ప్రిపరేషన్కు తక్కువ సమయమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రిలిమ్స్కు మూడు లేదా నాలుగు నెలలు, ఆ తర్వాత మెయిన్కు మూడు నుంచి నాలుగు నెలలే గడువునివ్వడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ నిబంధనలు
అంతా ప్రహసనం..
ఇలా ఒక నోటిఫికేషన్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దుచేయడం దాదాపు ఇదే తొలిసారి. స్వరాష్ట్రం సహా ఉమ్మడి రాష్ట్రంలోను ఇలాంటి దాఖలాలు లేవు. గతంలో లీకేజీలు వంటి కారణంగా పరీక్షలు రద్దయిన సందర్భాలున్నాయి.. కానీ ఒక నోటిఫికేషన్ను రద్దుచేయడం ఇదే మొదటిసారి అని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో గ్రూప్ -1 పరీక్ష పలు మార్లు వాయిదాపడింది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రిలిమ్స్ జరగగా, మెయిన్ను 2016లో నిర్వహించారు. అంతేకానీ నోటిఫికేషన్ రద్దుకాలేదు. రాజకీయ కారణాలతోనే నోటిఫికేషన్ను రద్దుచేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాను 20 ఏండ్లుగా ఏపీపీఎస్సీని, పదేండ్లు టీఎస్పీఎస్సీని దగ్గరగా పరిశీలిస్తున్నానని.. ఇలా ఎప్పుడు పరీక్ష రద్దుకాలేదని పోటీపరీక్షల శిక్షకురాలు దీపికారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా తాజా నోటిఫికేషన్ రద్దుతో గతంలో దరఖాస్తు చేసిన వారి పరిస్థితి ఏంటన్న.. ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభ్యర్థులు పదేండ్లుగా ఒకే సిలబస్ను చదువుతున్నారు. ఇప్పటికే సన్నద్ధమవుతున్న వారు కరెంట్ అఫైర్స్, జీకే వంటి అంశాల్లో కొత్తవి చోటుచేసుకోవటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. గతంలో క్వాలిఫై అయిన వారు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
మళ్లీ కేసుల చిక్కు..
గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దును కొంతమంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సి రావటం, కొత్త వారు దరఖాస్తు చేయనుండటంతో పోటీ ఎక్కువవుతుందన్న వాదనలున్నాయి. నోటిఫికేషన్ రద్దుపై కోర్టునాశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. పేపర్ లీకేజీల కారణంగా ఏఈ, టీబీపీవో, ఏఈఈ, డీఏవో వంటి పరీక్షలు రద్దయ్యాయి. కానీ కమిషన్ ఆయా నోటిఫికేషన్లు రద్దుచేయలేదు. వీటిలో కొన్నింటికి పరీక్షలను నిర్వహించి ఇటీవలే ఫలితాలను సైతం ప్రకటించించింది. ఇదే తరహాలో పరీక్షను నిర్వహిస్తే బాగుండేదని అభ్యర్థులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
క్రెడిట్ కొట్టేందుకేనా..
వాస్తవానికి కొత్తగా చేర్చిన 60 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశమున్నా రాజకీయ లబ్ధి కోసమే కొత్త నోటిఫికేషన్ వైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. గత కేసీఆర్ ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిందన్న వాదనలను చెరిపివేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర క్యాబినెట్లోను చర్చించినట్టు తెలిసింది. కొత్తగా చేర్చిన వాటితో సహా మొత్తం 563 పోస్టులను తామే భర్తీచేసినట్టు క్రెడిట్కొట్టేందుకే ఇలా చేసినట్టు రాజకీయ విశ్లేషకులుంటున్నారు.
20 రోజులు ఆలస్యంగా..
కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి 1న గ్రూప్ -1 నోటిఫికేషన్ను జారీచేస్తామని ప్రకటించారు. అయితే ఈ నోటిఫికేషన్ను జారీచేయడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. దీనిపై అటు యువత.. రాజకీయపక్షాల నుంచి విమర్శల దాడి ఎదురయ్యింది. సోషల్ మీడియాలోను పలువురు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తొలి జాబ్ గ్యారెంటీకే దిక్కులేకుండా పోయిందన్న విమర్శలొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరయ్యింది. ఎట్టకేలకు 20 రోజులు ఆలస్యంగా కొత్త నోటిఫికేషన్ను జారీచేసింది.