హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ అమాయక నిరుద్యోగ యువత నుంచి కొంత మంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దానిని సీరియస్గా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది.
కేవలం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా, పూర్తి పారదర్శకంగా కొనసాగుతున్నదని స్పష్టం చేసింది. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.