హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): పోలీస్ ఉద్యోగాలకు 97,175 మందిని అర్హులుగా తేల్చినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉద్యోగాల నియామక ప్రక్రియ తుదిదశకు చేరిందని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 26 వరకు 1,08,940 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టినట్టు తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతున్నదని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని హితవు పలికారు. కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎకువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
వివిధ ఉద్యోగాలకు ఒక్కో రకంగా వయో పరిమితి ఉన్నదని తెలిపారు. అర్హులకే పోలీస్ ఉద్యోగం దక్కేలా పారదర్శకంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు తెలిస్తే పోలీసు నియామక మండలి దృష్టికి తేవాలని సూచించారు. పకా సమాచారం ఇచ్చిన వారికి రూ.3 లక్షల పారితోషికం ఇస్తామని ప్రకటించారు. కొన్ని పత్రికల్లో వస్తున్న అబద్ధపు వార్తలను అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న వారి వివరాలను తమకు అందజేయాలని, 93937 11110 లేదా 93910 05006లో నంబర్లలో తమను సంప్రదించాలని పేర్కొన్నారు.