TS Weather Update | రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలను ఆకర్షిస్తుందని, ఆయా మేఘాలు తెలుగు రాష్ట్రాలపై ఆవరించి ఉన్నాయని తెలిపింది. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది.
హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆవర్తనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని, అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమపై ప్రభావం ఉండదని తెలిపింది. బంగాళాఖాతంలో చెన్నైకి దగ్గరలో ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాయలసీమలోనూ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది.