TS Weather Update | తెలంగాణలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని అధికారులు వివరించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండతాకిడికి తాళలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మూగజీవాలు సైతం ఎండ, వేడిని తట్టుకులేకపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనం మధ్యాహ్నం వేళల్లో ఇంటికే పరిమితమవుతున్నారు. సాయంత్రం సమయంలో బయటకు వస్తుండడంతో రోజువారి వ్యాపారాలు పడిపోతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సోమవారం మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్లో 45.8, జన్నారంలో 45.8, బెల్లంపల్లిలో 45.4, నీల్వాయి 45.5, కొమ్మెర 44, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కుమ్రంభీం జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో 45.1, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి 38 నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.