హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు పడమర ద్రోణి, ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాల మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొంది.
మరో వైపు ఉత్తర ద్వీపకల్ప దేశమంతటా విస్తరించిన షీర్ జోన్ బుధవారం బలహీన పడినట్లు చెప్పింది. దీంతో ప్రభావంతో రాష్ట్రంతో వర్షం తీవ్రత తగ్గి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షాపాతం నమోదైంది. మహబూబ్నగర్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది.