TS Weather | తెలుగు రాష్ట్రాల్లో చలివాతావరణం పెరుగుతున్నది. రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. మరో వైపు మూడురోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు తీవ్ర చలితో వణుకుతున్నాయి.
తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయినట్లు వాతావరణశాఖ పేర్కొంది.
ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మొన్నటి వరకు రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు పడిపోగా.. ఆదివారం నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా 27.6 డిగ్రీలకు చేరాయి. రానున్న రెండు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ఉదయం సమయాల్లో రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు కురుస్తున్నది. ప్రధాన రహదారులపై మంచుపేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ఏపీలోనూ చలి తీవత్రత ఎక్కువగానే ఉన్నది. రాబోయే రెండురోజులు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.